మూడు రాష్ర్టాలతోనే ఇచ్చి ఉంటే.. ఇక్కడ ఆత్మాహుతులు జరిగేవా?
కాకినాడ తీర్మానాన్ని పాతర పెట్టారు
తెలంగాణను గోస పెట్టారు
రాష్ర్టాల మధ్య చిచ్చు పెడుతున్నారు
ఆంధ్రాపైనా.. మోదీది సవతి ప్రేమే
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 10 : ఒక ఓటు.. రెండు రాష్ర్టాలంటూ కాకినాడలో తీర్మానం చేసిన బీజేపీ, దేశంలో 3 రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్ ధ్వజమెత్తారు. అందువల్లనే 1200 మంది బలైపోయారని ఆవేదన చెందారు. పార్లమెంటు వేదికగా తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీ తన వ్యాఖ్యలతో ఆరు దశాబ్దాల పోరాటాన్ని అపహాస్యం చేశారని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
తల్లి-బిడ్డ వ్యాఖ్యలతోనే చిచ్చు..
ఆది నుంచి తెలుగు రాష్ర్టాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా విభజనపై విషం కక్కారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారంటూ అపహాస్యంచేశారు. గతంలో పార్లమెంటు వేదికగా విషం కక్కిన ఆయన.. తాజాగా మళ్లీ రాజ్యసభలో తెలుగు రాష్ర్టాల మధ్య చిచ్చురేపేందుకు కుట్ర పన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడున్నరేండ్లు దాటింది. అయినా ఆ అంశాన్ని మాట్లాడటమంటే రెండు రాష్ర్టాలు ప్రశాంతంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని అర్థమవుతుంది. మోదీలోని అసలు కోణం బట్టబయలైంది.
నాటకాలు బంద్ చేయాలి
బీజేపీ మూడు రాష్ర్టాలను శాంతియుతంగా ఏర్పాటు చేసిందని చెప్పిన మోదీ.. ఆ సమయంలో తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎందుకు విస్మరించిందన్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా.. విభజన హామీలు అమలు చేయకుండా.. పార్లమెంటు వేదికగా రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి నాటకాలు బంద్ చేయాలి. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటిని ఇవ్వాలి. తెలంగాణ బీజేపీ నేతలు కూడా మోదీ వ్యాఖ్యల్ని సమర్థించి ప్రజల ఛీత్కారానికి గురవుతారో.. వారి ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకొంటారో తేల్చుకోవాలి.
నియంతలా వ్యవహరిస్తున్నారు
ప్రధాని మోదీ మొదటినుంచి నియంతలా వ్యవహరిస్తున్నారు. రాష్ర్టాల హక్కులను హరించి.. కేంద్రం పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి కేంద్ర-రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసేలా వ్యహరిస్తున్నారే తప్ప ఏ ఒక్క రోజూ సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించలేదు. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ర్టాలు నష్టపోతున్నాయని చెప్తున్న ప్రధాని.. ఇన్నేండ్లు తెలుగు రాష్ర్టాలకు ఏం చేశారో చెప్పాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అమలు చేయకుండా రెండు రాష్ర్టాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ వంటి హామీలను తుంగలో తొక్కారు. ఆంధ్రప్రదేశ్పైనా ప్రధాని చూపేది సవతి తల్లి ప్రేమే.. చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి ఇచ్చి ఆ రాష్ర్టానికి కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారు.