హైదరాబాద్ : అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోదీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నిలదీశారు. అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని, తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం ముందు సోమవారం సీపీఐ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ.. అదానీ ఆర్థిక సామ్రాజ్యం గాలిబుడగ లాంటిదని.. అది అవినీతి పునాదులపైన నిర్మించిన సామ్రాజ్యమని విమర్శించారు. హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదిక తదుపరి, అదానీ అవినీతి సంపాదన గుట్టురట్టు అయ్యిందన్నారు. నరేంద్రమోదీ కనుసన్నలలోనే ఎల్ఐసీ నుంచి రూ. 80 వేల కోట్లు, ఎస్బీఐ నుంచి రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు అదానీ కంపెనీలలో పెట్టారని తెలిపారు. ప్రజల సొమ్మును అదానీ కంపెనీలో ఎలా పెట్టుబడులు పెడతారన్న కూనంనేని, ఇప్పుడు నష్టపోయిన సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపైన ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలను క్రమంగా తగ్గిస్తున్నారని, ఆహారం మీద రూ. 1 లక్ష కోట్లు తగ్గించారని, ఎరువులపైన రూ. 50 వేల కోట్లు ఆ విధంగా మొత్తం సబ్సిడీలను ఇప్పుడు రూ. 3 లక్షల కోట్లకు తగ్గించారని కూనంనేని ధ్వజమెత్తారు.
చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాక ముందు అదానీ అనే వాడెవరో సమాజానికి తెలియదన్నారు. కానీ మోదీ అండదండలతో ప్రపంచ కుబేరులలో అదానీ స్థానం పొందారన్నారు. దేశంలోని సహజవనరులను కొల్లగొట్టి అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెపుతున్నారని, ధనవంతుడు మరింత ధనవంతుడుగా అవుతున్నారన్నారు. అలాగే పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్నాడని పేర్కొన్నారు. మోదీ విధానాల వలన బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ. 30 వేల కోట్లు కోత విధించారని, ప్రజలకు ఇచ్చే సొమ్ముపై కోతలు విధించి, కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.