హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): జీ-20, పర్యావరణ సదస్సుల్లో దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. సంపన్న దేశాలు వడ్డీ రేట్లను పెంచడం భారత్కు ప్రతికూలంగా మారిందని, వాటిని నియంత్రించేలా ఒత్తిడి తేవడంలో మోదీ విఫలమయ్యారని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో అభివృద్ధి నినాదం పకకు పోయి, కామన్ సివిల్కోడ్, సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేయడం అనే అంశాలు ముందుకొచ్చాయని వివరించారు.
వివిధ రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయి? వాటిపై ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాయి? నిధులెకడి నుంచి వస్తాయంటూ ఎన్నికల సంఘం (ఈసీ) ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొలిట్బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ మాట్లాడుతూ.. గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గవర్నర్లు రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదని హితవు చెప్పారు. కేరళ, తమిళనాడు, తెలంగాణలో ఇదే తతంగం నడుస్తున్నదని పేర్కొన్నారు. అలాంటి గవర్నర్లను రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో దాని ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని హెచ్చరించారు. ఉప ఎన్నిక సందర్భంగా పోడుభూములతో పాటు అనేక ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చామని వివరించారు. పోడు భూములకు మూడు నెలల్లోగా పట్టాలిస్తామంటూ హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీట్లకు సంబంధించి ఇప్పటివరకు తమ పార్టీలో చర్చ జరగలేదని తమ్మినేని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.