హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
45 సబ్జెక్టులకు సీపీగెట్ను నిర్వహించారు. 67,027 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 57,262 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ఆగస్టు 11 నుంచి 23 వరకు జరిగిన విషయం తెలిసిందే. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీతో కాకతీయ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా వర్సీటీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.