హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హత్యచేయడం కోసం రూ.15లక్షలు సుపారీ తీసుకున్నట్టు వెల్లడించారు. శుక్రవారం టీజీఐసీసీసీలో జరిగిన సమావేశంలో లాయర్ మొయిజుద్దీన్ హత్యకేసు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సజ్జనార్ వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు ముజాహిద్ ఆలంఖాన్తోపాటు ఆయన తండ్రి మహబూబ్ ఆలంఖాన్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ నేతలు. కొన్నేండ్లుగా మలక్పేట, లక్డీకాపూల్ వక్ఫ్ ఆస్తులు, నిర్వహణ, సమస్యలకు సంబంధించి నిందితుడు ముజాహిద్ ఆలంఖాన్కు న్యాయవాది మొయిజుద్దీన్కు మధ్య వివాదం కొనసాగుతున్నది.
ఈ రెండువర్గాల మధ్య అనేక సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. తమపై జరుగుతున్న విచారణల్లో మొయిజుద్దీన్ తరచూ పాల్గొం టూ తమకు ఎదురుదెబ్బతగిలేలా చేస్తున్నారని భావించిన ముజాహిద్.. తన తండ్రితో మాట్లాడి మొయిజుద్దీన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. వీరిద్దరూ తమకు సన్నిహితులైన చావూస్, మునీర్తో మాట్లాడి కిషన్ అలియాస్ పప్పుతో రూ.15లక్షలకు హత్య చేయడానికి డీల్ కుదుర్చుకున్నారు. అందులోభాగంగా నంబర్ప్లేట్ లేని గ్రీన్ స్కార్పియో వాహనాన్ని రూ.2లక్షలకు కొనుగోలు చేసి 6 నెలలుగా న్యాయవాది ఇంటి దగ్గర రెక్కీ చేశారు.
ఆ తర్వాత ఆయన కదలికలను బట్టి హత్యకు ప్రణాళిక రూపొందించుకొని కిషన్ అలియాస్ పప్పు, అభిజిత్ అలియాస్ నాని, దిఘన్ వినయ్, విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటు, మణిదీప్ అలియాస్ పోగోనాని కలిసి మొయిజుద్దీన్ను హత్యచేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన తండ్రీకొడుకులు మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్తోపాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు హసన్ అలీ అలియాస్ చావూస్, మునీర్, దీన్దయాళ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
వీరికోసం ప్రత్యేక బృందాలు గాలిం పు చర్యలు ముమ్మరం చేశాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.10.10లక్షల నగదు, స్కార్పియో వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పా రు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, కేవలం వక్ఫ్ భూముల వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు సజ్జనార్ తెలిపారు. కాగా న్యాయవాది హత్యకేసులో అరెస్ట యిన కారణంగా కాంగ్రెస్ నాయకుడు ముజా హిద్ ఆలమ్ఖాన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు.