CP Ranganath | వరంగల్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్( CP Ranganath ) తీవ్రంగా స్పందించారు. ‘నన్ను లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారు. లేని నిందలు మోపారు. ఒక్క సెటిల్మెంట్, ఒక్క దందా, ఒక్క డీల్ చేసినట్లు లేదా నాకు లాభం వచ్చేలా ఏదైనా డీల్ చేసినట్లు నిరూపిస్తే.. అక్రమ ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోతాను’ అని ఏవీ రంగనాథ్ బండి సంజయ్కు సవాల్ చేశారు.
వరంగల్లో సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఏదో చేశానని, ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఏదో చేశానని ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎందుకు ఈ ఆరోపణలు చేయలేదు. అరెస్టు కాగానే ఈ ఆరోపణలు చేశారు. నల్లగొండలో నేను పని చేసినప్పుడు కూడా అన్ని పార్టీల నేతలు అరెస్టు అయ్యారు. వరంగల్లో కూడా అన్ని పార్టీల నేతలు అరెస్టు అయ్యారు. అప్పుడు చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు అని బండి సంజయ్ను రంగనాథ్ ప్రశ్నించారు.
‘నా బాధితులు బండి సంజయ్ను కలిశారని ఏదో పేపర్లో చదివాను. ఖమ్మం, కొత్తగూడెం ప్రజలు నన్ను గుర్తు పెట్టుకున్నారు. నేను ఎవరి పక్షాన ఉంటాను అనేది నేను పని చేసిన చోట ప్రజలకు తెలుసు. బండి సంజయ్ దగ్గరికి వచ్చిన బాధితుల్లో ఎవరై ఉంటారంటే.. అరెస్టు అయిన రౌడీషీటర్లు, పీడీయాక్ట్ నమోదైనవారు, చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు అయి ఉండొచ్చు. భూ కబ్జాదారులు ఉండొచ్చు. అయితే నా వద్దకు భూకబ్జాదారులు, రౌడీషీటర్లు, చీటర్ల బాధితులు వస్తారు. వాళ్లంతా సామాన్యులు, పేదవర్గాల వారు ఉంటారు. వాళ్లందరూ కూడా రేపు బయటకు వచ్చి.. ఇది జరిగిందని చెప్తారు. ఇది ప్రజలకు కూడా తెలియాలి’ అని రంగనాథ్ పేర్కొన్నారు.
‘సెటిల్మెంట్స్, దందాలు చేశాను అని బండి సంజయ్ అన్నారు. ఆ మాటలు విన్న తర్వాత నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియలేదు. సెటిల్మెంట్స్, దందాలు చేసి అక్రమ ఆస్తులు సంపాయించాను అని అన్నారు. ఒక్క సెటిల్మెంట్, ఒక్క దందా, ఒక్క డీల్ కానీ నాకు లాభం వచ్చేలా ఏదైనా చేసినట్లు నిరూపిస్తే.. అక్రమ ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోతాను’ అని రంగనాథ్ సవాల్ చేశారు.
‘సత్యంబాబు కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు గురించి బండి సంజయ్కు విషయం తెలియనట్లుంది. ఆ కేసును విచారించింది వేరే అధికారులు’ అని రంగనాథ్ పేర్కొన్నారు.
‘ఇక బండి సంజయ్ కేసు విషయంలో ప్రమాణం చేయమని అంటున్నారు. ప్రమాణాలు చేసి ఉద్యోగంలోకి వస్తాం. నేను చేసే కేసుల్లో విశ్వసనీయతను డెవలప్ చేసుకుంటాం. ఉద్యోగ పరంగా చేసిన దర్యాప్తు అది. ఈటలను గౌరవంగా విచారించి, ఆధారాలు తీసుకుని, స్టేట్మెంట్ రికార్డు చేసి పంపించాం. టెన్త్ మాల్ ప్రాక్టీస్ కేసులో అందరి నుంచి ఆధారాలు తీసుకుంటాం అని తెలిపారు. హిందీ ప్రశ్నపత్రం కేసు కేవలం మాల్ ప్రాక్టీస్ మాత్రమే.. అది లీక్ కాదు. పరీక్ష ప్రారంభం సమయం 9:30కి ముందైతే అది లీక్ అయినట్టు. ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత పేపర్ బయటకు వచ్చింది.. అది కేవలం మాల్ ప్రాక్టీస్ మాత్రమే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని’ సీపీ రంగనాథ్ తెలిపారు.
‘నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశాను. నా సర్వీసులో సెటిల్మెంట్లు, దందాలు చేసే వారిని వదిలిపెట్టలేదు. నా దగ్గరకు సామాన్యులు మాత్రమే వస్తారు. రాజకీయ నాయకులు రారు. ఎక్కడా చేసిన కూడా నా వద్దకు సామాన్యులే వచ్చి గోడును వెల్లబోసుకుంటారు. వీళ్లకు న్యాయం చేసేందుకు యత్నిస్తాం’ అని రంగనాథ్ స్పష్టం చేశారు.