CPI | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛినం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. కానీ ఆయన్నే రామమందిర ప్రారంభోత్సవానికి రావొద్దని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తుచేశారు. దేశ సంపదను అదానీ చేతికి అప్పగించారని విమర్శించారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరంగా తయారు చేస్తున్నారన్నారు. దేశానికి రైట్ వింగ్ ప్రమాదకరమా? లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ తెలిపారు. సంస్థాగత వ్యవస్థలను మోదీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధ్వంస పాలన అంతం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. తెలంగాణలో కూడా ఇండియా కూటమిని బలపరుస్తామని చెప్పారు.
బడుగు, బలహీన వర్గాల గొంతే ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్మికులు, పేద వారి తరపున గొంతు వినిపించేది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ అంతరిస్తుందని కొంత మంది పనిగట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఒక ఎమ్మెల్యే సీటు సీపీఐ గెలిస్తే రెండు రాష్ర్టాల్లో ప్రజలు సంబురాలు చేసుకున్నారన్నారు. ఎర్రజెండాను నమ్ముకున్న వారు పార్టీ మారరని తెలిపారు. వచ్చేది వందో సంవత్సరం అవుతుందని, అందుకే పార్టీని మరింత బలోపేతం కోసం పనిచేస్తామని కూనంనేని చెప్పారు.