హైదరాబాద్ : కరోనా మూడో దశ ప్రారంభమైందని రాష్ట్ర ప్రజావైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో ఒకే రోజు పదివేలకుపైగా కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నుంచి కేసులు పెరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు వస్తున్నాయన్నారు. కేసుల పెరుగుదలను ముందుగానే గుర్తించామన్నారు.
రాష్ట్రంలో గత ఐదు రోజుల్లో 4రెట్లకుపైగా కేసుల పెరుగుదల నమోదైందన్నారు. కరోనా పాజిటివిటీ రేటు కూడా మూడు శాతానికిపైగానే ఉందని పేర్కొన్నారు. కొత్త కేసుల్లో 70శాతం ఒమిక్రాన్ కేసులు అనుకోవచ్చని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసులను బులిటెన్లో ప్రత్యేకంగా పేర్కొనమని, కేసులు వేలాదిగా వస్తున్నా తీవ్ర ప్రభావం లేదని తెలిపారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినవారు ఐదురోజుల్లోనే కోలుకుంటున్నారన్నారు. కేవలం పది శాతం మందిలో మాత్రమే లక్షణాలున్నాయన్నారు.
సెకండ్ వేవ్లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరించారు. డెల్టా సోకితే మూడు రోజుల తర్వాత లక్షణాలు తీవ్రతరమవుతాయన్నారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని సూచించారు. ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలుంటేనే ఆసుపత్రిలో చేరాలని, భవిష్యత్తులో 90శాతం కేసులు ఒమిక్రాన్తోనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ ప్రోటోకాల్ పాటిస్తున్నట్లు తెలిపారు.
అవసరమైన వారినే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ను ప్రైవేటు ఆసుపత్రులు పాటించాలని ఆదేశించారు. అనవసరంగా ప్రజల డబ్బు వృథా చేయొద్దని సూచించారు. ప్రైవేటు అనవసరంగా చికిత్స చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైరస్ బారినపడ్డ బాధితులు సొంత వైద్యం చేసుకోకుండా.. వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.