హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నది. 24 గంటల్లో కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింపయ్యింది. సోమవారం నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారం ఏకంగా 1,520 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. జిల్లాల్లో కాస్త అదుపులోనే ఉన్నా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పరిస్థితి తీవ్రమవుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 979 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 132, రంగారెడ్డిలో 174 మందికి పాజిటివ్గా తేలింది. సంగారెడ్డిలో 26, సూర్యపేటలో 16, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కొత్తగా 18 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో 247 మంది ప్రయాణికులకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరో 18 మందికి పాజిటివ్గా తేలింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై బుధవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంతోపాటు దవాఖానల్లో సౌకర్యాల కల్పన, బస్తీ దవాఖానాల పెంపుపై ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మంత్రి హరీశ్ తాజా పరిస్థితిపై సమీక్షించారు. టీఎస్ఎంఎస్ఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆ శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ సమావేశంలో పాల్గొన్నారు.
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు (ఎలక్ట్) డాక్టర్ బీఎన్ రావు సూచించారు. కరోనాతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి వేగంగా పెరుగుతున్నదని హెచ్చరించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.