కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దు
ఇంటర్నెట్, సోషల్మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా,
బహిరంగసభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో ఎలాంటి కామెంట్లు చెయ్యొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశం
ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసిన జడ్జీ
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని బండి సంజయ్ని ఆదేశిస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్, సోషల్మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, బహిరంగసభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో కేటీఆర్ పరువుకు భంగం కలిగించే విధంగా బండి సంజయ్ సహా ఇతరులు మాట్లాడరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సెకండ్ అడిషనల్ చీఫ్ జడ్జి ఇంజంక్షన్ ఆర్డర్ జారీచేశారు. ట్విట్టర్లో గత నెల 11న తనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. అంతకంటే ముందు బండి సంజయ్కి నోటీసులు జారీ చేసిన కేటీఆర్.. తనకు 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పకపోవడంతో కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
బండి సంజయ్ దురుద్దేపూర్వకంగా, అభూతకల్పనలతో తనపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధినేతగా ఉన్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఆక్షేపించారు. ప్రచార యావతో లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠకు, పరువుకు భంగం కలిగించారని తెలిపారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారాన్ని తనకు ఆపాదించేందుకు ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. తనకు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేకనే బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని స్పష్టంచేశారు. ప్రజా జీవితంలో మచ్చలేని నేతగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న తనపై దర్బుద్ధితో బండి సంజయ్ దుమ్మెత్తిపోయడాన్ని అడ్డుకోవాలని కోర్టును కోరారు. ఐటీ మంత్రిగా ‘సోచ్ చాలెంజర్ ఆఫ్ ది ఇయర్’ వంటి అనేక అవార్డులు దకించుకోవడమే తన పనితీరుకు ఉదాహరణ అని కేటీఆర్ వివరించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని, లేనిపక్షంలో సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం బండి సంజయ్ శిక్షార్హుడని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇకపై తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లకుండా బండి సంజయ్ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు అడిషినల్ చీఫ్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ తరఫున న్యాయవాదులు పీ మోహిత్రెడ్డి, కేవీ రుషీక్రెడ్డి, సాకేత్ మొవ్వ, హంసిని దుర్వాసుల, మహీ గోనె వాదనలు వినిపించారు.