కేసముద్రం, డిసెంబర్13 : ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే వారికి కన్నీళ్లే మిగిలాయి. కష్టాలు కడతేరే మార్గం లేదని భావించిన ఆ దంపతులు చావే శరణ్యమనకున్నారు. పురుగుల మందు తాగి(Pesticides) ఆత్మహత్యాయత్నానికి(Couples suicide) పాల్పడ్డారు. ఈ సంఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయవిదారకర సంఘటన మహబూబాబాద్(Mahbubabad) జిల్లా కేసముంద్రం మండలంలోని క్యాంపు తండాలో చోటు చేసుకుంది.
బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన ధరావత్ వీరన్న(40) లలిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎకరంన్నర భూమిలో మిర్చి, ఎకరం భూమిలో పత్తి సాగు చేశారు. మిర్చికి గుబ్బ రోగం రాగా పంటను కాపాడుకోవడానికి వేల రూపాయలు అప్పులు తెచ్చి క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు.
అయినప్పటికి మిర్చి పంట చేతికి రాకపోవడం, మరోవైపు పత్తి పంట దిగుబడి తగ్గిపోయింది. మిగ్జాం తుఫాన్ కారణంగా చేతికి అందివచ్చిన వరి పంట వర్షానికి తడిసి మొలకెత్తింది. మిర్చి, పత్తి, వరి పంటలకు సుమారు రూ.3 లక్షల వరకు అప్పులు తీసుకవచ్చి పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు తీర్చలేమని భావించిన దంపతులు మిర్చి తోట వద్ద ఈ నెల 8న పురుగుల మందు తాగారు.
గమనించిన రైతులు చికిత్స కోసం మహబూబా బాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. వీరన్న పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. లలిత మహబూబాబాద్లో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తండ్రి లచ్చు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.