కారేపల్లి, ఆగస్టు 19: విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40) 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కూతురు ఉంది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం షమీన బట్టలను ఇంటి ఎదుట ఉన్న ఇనుప తీగ(దండెం)పై ఆరేస్తుండగా.. ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్తో అక్కడికక్కడే పడిపోయింది.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షమీన అప్పుడప్పుడు స్పృహతప్పి పడిపోతూ ఉండేది. గమనించిని ఆమె భర్త శ్రీను.. షమీన అలాగే పడిపోయిందనుకొని తన భార్యను లేపేందుకు యత్నించాడు. దీంతో అతడికి కూడా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. గమనించిన శ్రీను స్నేహితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ దంపతులను వెంటనే ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కుమార్తె ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై రాజారాం తెలిపారు.