హైదరాబాద్ : ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, ముందు పురుగుల మందు సేవించినట్లుగా సమాచారం. మంగళవారం తెల్లవారే సరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. స్థానికులు చెరువులో గాలించగా.. మరో మహిళ మృతదేహం లభ్యమైంది.
మృతులను హైదరాబాద్ సంతోష్నగర్కు చెందిన కుద్దుస్ పాషా (37), ఫాతిమా (28), మహేక్ బేగం (9), ఫిర్దోస్ బేగం (6)గా గుర్తించారు. కుద్దుస్ పాషా సోమవారం బావమరిది హమీద్ను రూ.10వేలు అడిగినట్లుగా తెలుస్తున్నది. ఆత్మహత్యకు అప్పుల బాధే కారణంగా తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుళ్లతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.