సూర్యాపేట టౌన్ : మోదీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసిరిగిపోయారని, ఎందుకే ఆయనను ఎదుర్కొనే నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోదీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ సారథి, సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పట్టణానికి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ మడిపల్లి
విక్రమ్ (కాంగ్రెస్)తోపాటు సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందిన పాత సూర్యాపేట, కందగట్ల గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 200 మంది గులాబీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీకి ప్రచార కార్యదర్శిగా రాహుల్గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపే సరైన నాయకత్వం లేక ఆ పార్టీ లీడర్లు, క్యాడర్లు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రధానమంత్రి మోదీ దేశ సంపదను కొంత మంది కార్పొరేట్ శక్తులకు తాకట్టుపెడుతూ పేదలను మరింత పేదరికంలోకి నెట్టే కుట్ర చేస్తూ దేశంలో అరాచక పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. మోదీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్కు మాత్రమే ఉన్నదని దేశ ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పారు.
అందుకే అన్ని రాష్ట్రాల ప్రజలు మన సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, మన అభివృద్ధి, సంక్షేమ పాలన తమకూ కావాలని వారు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ సాధించి అన్ని రంగాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేశారన్నారు. అదే తరహాలో బీఆర్ఎస్తో దేశ అభివృద్ధిలో పెను మార్పులు ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ వచ్చినంకనే రాష్ట్రంలో ఆకలి చావులు ఆగిపోయాయని, అదే మాదిరిగా దేశంలో దారిద్య్రం పోయి ఆకలిచావులు ఆగాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమని అంతా నమ్ముతున్నారన్నారు. తెలంగాణ అమ్మాయిని పక్క రాష్ట్రం అబ్బాయి పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మీ చెక్కు వచ్చిందని, అక్కడి అమ్మాయిని తెలంగాణకు ఇస్తే రాలేదని చెప్పారు.
పక్క రాష్ట్రంలో కరెంట్ లేక మోటర్లు పోయక పొలాలు ఎండిపోతుంటే.. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తో మోటార్లు నిండుగా పోస్తున్నాయని, వ్యవసాయం పచ్చగా ఉన్నదని తెలిపారు. అందుకే తెలంగాణ మాదిరి పాలన తమకూ కావాలని, లేదంటే తమను తెలంగాణలో కలుపాలని వేడుకుంటున్నట్లు అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలే తమ సమావేశాల్లో వివరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి నిరోధకులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఉండబట్టలేక బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని వివరించారు.