ములుగు : ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం పెంపొందించుకొని సమాజానికి, ప్రభుత్వానికి దూరం తగ్గించేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం నీతి ఆయోగ్ బృందం సభ్యులు ములుగు జిల్లాల్లో పర్యటించారు.
నీతి ఆయోగ్ ముఖ్య కార్యదర్శి కె రాజేశ్వరరావు, సీనియర్ సలహాదారులు నీరజ్ సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ రాకేష్ నిరంజన్, వైస్ చైర్మన్ అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ శివంకు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్వాగతం పలికారు.
ముందుగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ.45 లక్షలతో నిర్మించిన న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ప్రేమ్ నగర్లోని అంగగన్వాడీ సెంటర్ ను సందర్శించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ములుగు జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రెండు జిల్లాల్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై జరిగిన పురోగతిని వివరించారు. అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే ఈ ప్రాంతం టూరిజం పరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఆంధ్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో చేపట్టిన సేంద్రియ వ్యవసాయాన్ని అధ్యయనం చేసి ములుగు, భూపాలపల్లి జిల్లాలోని రైతులను సైతం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పోషణతో పాటు మెరుగైన శిక్షణను పిల్లలకు అందించాలన్నారు.
రక్తహీనతతో బాధపడే వారు లేకుండా చిరుధాన్యాలను ప్రోత్సహించి ప్రజారోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
ఎన్జీవోల సహకారంతో సర్వే చేసి ప్రజారోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకునేందుకు యువతకు అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు కృషి చేస్తూ రసాయన రహిత సాగును చేపట్టాలన్నారు.