నిర్మల్ టౌన్, జనవరి 13: ఎరువుల ధరలు పెంచి ప్రధాని మోదీ.. రైతాంగాన్ని దగా చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాసిన లేఖకు జవాబివ్వాలని మోదీకి సవాల్ విసిరారు. నిర్మల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ రైతులకు ఏడేండ్లలో ఒక్క మంచి పనీ చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకొనేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, దాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలతో ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు మూడు చట్టాలను తెచ్చిన కేంద్రం.. ప్రస్తుత ఎన్నికల భయంతో వెనక్కి తీసుకొన్నదని విమర్శించారు.
వ్యవసాయ బోర్లకు విద్యుత్తు మీటర్లను ఏర్పాటు చేయాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారని గుర్తు చేశారు. రైతులతో కలిసి నాగలి ఎత్తి బీజేపీని గోతిలో పాతిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.