నల్లగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని చెప్పారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తాననడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హన్మకొండలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు కనీసం ఊసెత్తడం లేదని, మహారాష్ట్రకు మాత్రం కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని విమర్శించారు. కిషన్రెడ్డి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయించాలన్నారు.
దొడ్డు రకం వడ్లను కొనేది లేదని ఎఫ్సీఐ చెబుతున్నదని, దీనిపై కిషన్ రెడ్డి తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపెట్టాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలేనని, అంబానీ, ఆదానీలకు బీజేపీ వత్తాసు పలుకుతున్నదని విమర్శించారు. నల్ల చట్టాలను తెచ్చి రైతులను నట్టేట ముంచారని, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయిద్దని హైకోర్టు చెపితే, బండి సంజయ్ మాత్రం భాద్యతా రాహితంగా మాట్లాడుతున్నాడన్నారు.
సీఎం కేసీఆర్ ఫెడరల్ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని కలిశారని, దానిపై కూడా రాజకీయ దుమారం లేపారన్నారు. మాత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే బీజేపీ విధానమని విమర్శించారు.