Gutha Sukhender Reddy | నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్లగొండలో మీడియా ప్రతినిధులతో గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ చేశారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని గుత్తా చెప్పారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. తాను భాష ప్రయోగం విషయంలో హుందాగా ఉంటాను. బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదన్నారు. జిల్లా మంత్రికి, తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. జిల్లా అధికారిక వ్యవహారాల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోలేదు.. చేసుకోను కూడా అని గుత్తా స్పష్టం చేశారు. ఎవరైనా తన వద్దకు వచ్చినా నిబంధనలు ప్రకారం వెళ్లాలని చెబుతాను. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు.
తన కుమారుడు అమిత్కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారు. టికెట్ కోసం పైరవీలు చేయనని చెప్పారు. వామపక్షాలతో సీట్లు పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పు క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. వామపక్షాలు బీఆర్ఎస్తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలి. తాను చేసేది కరెక్ట్.. తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే బొక్కబోర్లా పడటం ఖాయమన్నారు. తమ పనిని ప్రజలు మెచ్చుతున్నారా.. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించాలి అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.