నల్లగొండ, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా, తప్పుడు ఆరోపణలు చేసినా సంపూర్ణ మెజారిటీతో మళ్లీ కేసీఆర్ సర్కారే అధికారంలోకి వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. కేంద్రం ఆధీనంలోని నీతి ఆయోగ్ ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వ అవార్డులే రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని అన్నారు. బుధవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తూ ప్రజా శ్రేయస్సును విస్మరించిందని ఆరోపించారు. అదానీ తరహా సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలను ముంచుతున్నాయని, ఇది దేశానికి ఏ మాత్రం మంచిదికాదని అన్నారు. బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థపై ఐటీ దాడులు దేశ ప్రతిష్ఠకు మంచిదికాదని సూచించారు. వివిధ రకాల సెస్సుల పేరిట దొడ్డిదారిన రూ.20 లక్షల కోట్లు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు పైసా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
కేంద్రం రూ.146 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కానీ రాష్ట్రం చేసిన రూ.4 లక్షల కోట్ల అప్పులతో.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, యాదాద్రి పవర్ ప్లాంట్, హైదరాబాద్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కనిపిస్తున్నాయని వివరించారు. రాష్ర్టానికి రూ.2,400 కోట్ల జీఎస్టీ బకాయిలను ఇవ్వడం లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు బాగుపడాలన్నా, వ్యవసాయరంగం పునరుజ్జీవం పొందాలన్నా సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్న భావన దేశ ప్రజలు, రైతుల్లో నెలకొన్నదని తెలిపారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాయని, అనేక విషయాలపై ప్రజలకు స్పష్టత వచ్చేలా చర్చ జరిగిందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ప్రజలకు వివరించారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని, ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అస్సలు హంగ్కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.