నల్లగొండ: తెలంగాణకు బీజేపీ ప్రమాదకారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాషాయ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకున్నదని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నదని ఆగహ్రం వ్యక్తంచేశారు. ఢిల్లీ నుంచి వచ్చే దూతలు ఇక్కడి బీజేపీ నాయకులను ఆడిస్తున్నారని విమర్శించారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని, రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్ల వచ్చిందని చెప్పారు. రాజగోపాల్ బీజేపీ చేతిలో పావుగా మారాడన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీకి బుద్ధిచెబుతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టారు. ఈ నెల 20న మునుగోడులో జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.