నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి ప్రజలు ఆశీర్వదించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) కోరారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్ మరో ఐదేండ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. బీపీఎల్ కుటుంబాలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ దేశంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. రైతు బీమాకు సమానంగా కేసీఆర్ బీమా అందించడం సంతోషకరమన్నారు.
రైతులపై కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనంగా మరోసారి రైతుబంధు మొత్తాన్ని పెంచారన్నారు. వచ్చే ఐదేళ్లల్లో రైతుబంధు మొత్తాన్ని ఎకరాకు 16వేలు చేయబోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా చేయకపోయినా దాన్ని లెక్కచేయకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
మహిళా సంక్షేమం కోసం మహాలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, పెన్షనర్లకు, కుల వృత్తులకు పెన్షన్ మార్చి నెల నుంచి 3016 సంవత్సరానికి 500లు పెంచుతూ ఐదేళ్లల్లో 5వేల రూపాయలు, వికలాంగులకు 6వేల వరకు పెంచడం దేశానికే మార్గదర్శకంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు కూడా రెసిడెన్షియస్ స్కూళ్లు పెట్టాలనుకోవడం మంచి నిర్ణయం అన్నారు.
అసైన్డ్ ల్యాండ్ పట్టాదారులకు సంపూర్ణమైన హక్కులు కల్పించాలని ఆలోచనతో ఉన్నారని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలనే యోచనతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.