నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కన్న కలలు అన్నింటినీ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. అలాంటి కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు. నల్లగొండలో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న భాష ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేయడం రేవంత్రెడ్డికి పరిపాటిగా మారిందని.. కేసీఆర్పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ లీడర్లు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని.. 50 ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో జాప్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని.. అందుకే కాంగ్రెస్ను కూడా ప్రజలు నమ్మరని అన్నారు.
కేంద్రం ఒక్క మంచి పని కూడా చేయలేదని గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి పగటి కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ పూర్తి చేశారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.