నల్లగొండ: స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక తెలంగాణలో దండులా విరుచుకుపడుతున్నారని విమర్శించారు. మళ్లీ దోచుకుందామని తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణపై ప్రధాని మోదీ అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ కూల్చారని ఫైరయ్యారు. ఇప్పుడు ప్రధాని కన్ను తెలంగాణపై పడిందన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామరక్ష అని చెప్పారు. దత్తపుత్రిక పాదయాత్ర చేస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులను జైల్లో పెట్టేలా అవినీతి చేసింది దత్త పుత్రిక కుటుంబం కాదా అని ప్రశ్నించారు. మళ్లి ఇక్కడకు వచ్చి నీతులు మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.