నల్లగొండ : తెలంగాణను దోచిన వాళ్లే మళ్లీ ఇక్కడ పాగా వేయాలని కుట్రలు చేస్తున్నారు. దురాలోచనతో వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నిన్న కాంగ్రెస్ వాళ్లు చేసిన రైతే రాజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీ లాంటి వ్యక్తి నే తెలంగాణ వాడిని అనడంలో ఓ పెద్ద కుట్ర దాగి ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోనీ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను రాకుండా అడ్డుపడి కుట్ర పన్నింది కేవీపీనే. ఇక షర్మిలది పెద్ద జోక్. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అంటున్నది.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రాజన్న పాలన కంటే వంద రేట్లు ఎక్కువగా తెలంగాణ ప్రజలు, అన్నదాతలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇది గమనించాలి. షర్మిల కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. ఆంధ్రలో రాజకీయాలు ఆమెకు చేత కాదు. తెలంగాణను దోచుకోవడం కోసమే షర్మిల కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆమె మాటల్లో అర్థం పర్థం ఉండదు.
తెలంగాణపై ఆధిపత్యం కోసమే వీరి అందరి ప్రయత్నం. కేవీపీ, షర్మిల, రేణుక చౌదరి లాంటి వాళ్లు తెలంగాణ పై దండయాత్ర మొదలు పెట్టారు. దోచుకోవాలని కుట్ర చేస్తున్నారు. సమైక్య వాదుల కబంద హస్తాల్లోకి తెలంగాణ మళ్లీ పోనీయొద్దన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు కూడా హైదరాబాద్లో ఉంటూ ఆంధ్ర లో రాజకీయాలు చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ పై కుట్రలు చేస్తాం అంటే మాత్రం కుదరదని హెచ్చరించారు. జమిలి ఎన్నికలు అసలు సాధ్యం కాదు. బీజేపీ ప్రయోజనాల కోసమే జమిలి ఎన్నికలు తెస్తున్నారని మండిపడ్డారు. అది నుంచి మోదీ తెలంగాణపై అక్కసు ఉన్నది. దక్షిణాది రాష్టాలాంటే కూడా మోదీకి నచ్చదన్నారు.