నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 4: పత్తి ధర పరుగులు పెడుతున్నది. ఆన్లైన్ బిడ్డింగ్లో కొనుగోలుకు అడ్తీదారులు పోటీ పడుతుండటంతో మంగళవారం రికార్డుస్థాయికి చేరింది. మద్దతు ధరను దాటి రెట్టింపు రేటు లభిస్తుండటంతో రైతన్నలు ఆనందంలో మునిగితేలుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.9,731 ధర పలికి రికార్డు సృష్టించింది. మహబూబాబాద్ మార్కెట్లో రూ.9,631, ఏనుమాములలో రూ.9,570తో వ్యాపారులు కొనుగోలు చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో గరిష్ఠ ధర రూ.9,722 పలికింది. మోడల్ ధర రూ.9,458, కనిష్ఠంగా రూ.8,336 లభించింది. అలాగే జమ్మికుంటలో గరిష్ఠంగా రూ.9,700 వచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి గరిష్ఠ ధర రూ.9,700 పలుకగా, మధ్యధర రూ.9,200 కనిష్ఠ ధర రూ.8 వేలు పలికింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్లో రూ.9,609 ధర పలుకగా, అత్యల్పంగా రూ.9,353 చెల్లించారు. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్తోపాటు కుమ్రంభీం ఆసిఫాబాద్లో క్వింటాల్కు రూ.9,600 దక్కింది.