ఖమ్మం: తెల్ల బంగారం (Cotton) రైతులకు సిరులు కురిపిస్తున్నది. ఖమ్మం జిల్లాలో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. జూలూరుపాడులో అత్యధికంగా క్వింటాల్కు రూ.10,200 పలికింది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో క్వింటాల్కు రూ.10 వేలు పలికింది. వరంగల్ జిల్లాలో కూడా పత్తి ధర రికార్డు స్థాయికి చేరింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ రూ.9,705 పలికింది. మార్కెట్ చరిత్రలో పత్తికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, అధిక ధర వస్తుండటంతో వ్యాపారులు ఉత్సాహం చూపిస్తున్నారు.
ప్రారంభంలో క్వింటాలు రూ.7 వేలకు మించని ధర తాజాగా రూ.10 వేల పైచిలుకుకు చేరింది. భైంసా మార్కెట్ యార్డులో మంగళవారం రూ.9600 పలికింది. అంతర్జాతీయంగా పత్తికి కొరత ఏర్పడంతోనే ధర పెరుగుతున్నదని వ్యాపారులు అంటున్నారు.