కౌటాల/పెద్దపల్లి, ఫిబ్రవరి 19 : పత్తి ధర తగ్గించడం, నాణ్యత పేరుతో కొనకపోవడంపై పత్తి రైతులు గురువారం నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తగ్గించడంతో రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించటంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఖరీదుదారులు కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారని అవేదన వ్యక్తంచేశారు.
బుధవారం క్వింటాలుకు రూ.7,500 ధర పలుకగా.. గురువారం రూ.5 వేలే పలుకడంతో ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటాలుకు రూ.2,500 వరకు తగ్గిస్తారా? అని మండిపడ్డారు. రాజీవ్ రహదారిపై ధర్నా చేసేందుకు యత్నించగా.. పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్రావు చేరుకొని, రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.
అనంతరం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి పడిగెల ప్రవీణ్రెడ్డి, జిన్నింగ్ మిల్లర్లు, ఖరీదుదారులు, అడ్తిదారులతో సమావేశమై పత్తి నాణ్యత బట్టి మరోసారి ధర వేయాలని సూచించారు. దీంతో ఖరీదుదారులు మరోమారు ధర వేసి కొనుగోలు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని శ్రీ వేంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనడం లేదని రైతులు గురువారం జిన్నింగ్ మిల్లు ముందు ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మిల్లులోని సీసీఐ పత్తి పరీక్ష గ్రేడర్ తేజారెడ్డి రైతులందరి పత్తిని నాణ్యతగా లేదంటూ కొనేందుకు తిరస్కరిస్తున్నాడని మండిపడ్డారు. రెండోసారి ఏరిన పత్తి మొదటి సారి వచ్చిన పంటలా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా తాము తెచ్చిన పత్తిని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. సీసీఐ అధికారులు స్పందించి పత్తిని కొనేందుకు చర్యలు తీసుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు.