విద్యాశాఖ సిబ్బంది : సార్ నమస్తే ఏమైంది.
పాఠశాల యాజమాన్యం : ఫైనాన్సియల్గా టైట్ ఉంది. డబ్బులిస్తేనే పని అవుతుందా?
విద్యాశాఖ సిబ్బంది : ఎన్నిరోజులైంది. ఏదైనా చూడు.. ఈ రోజు సబ్మిట్ చేయాలి.
పాఠశాల యాజమాన్యం : 25 వేలు రూ.30 వేలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి. డబ్బు పంపలేదనే ఆపారా?
విద్యాశాఖ సిబ్బంది : ఏదో ఒకటి పంపించండి. అందరికి కలిపి 25 వేలు పంపండి
పాఠశాల యాజమాన్యం : అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయి కదా.. మేమేం తప్పు చేయలేదు. ఇప్పుడు రూ.25 వేలు ఇస్తాం కానీ ఫిక్స్డ్గా ఇంత అని చెబితే మా లెక్కల్లో రాసుకుంటాం.
విద్యాశాఖ సిబ్బంది : ప్రస్తుతానికైతే 10 వేలు పంపించండి
పాఠశాల యాజమాన్యం : పది వేలు సరిపోతాయా? మళ్లీ హాల్టికెట్లకు వేరే ఇవ్వాల్నా?
విద్యాశాఖ సిబ్బంది : పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఫోన్ కూడా చేయను.
ఇదీ హైదరాబాద్ జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ సిబ్బంది మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణే విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతుందనడానికి ఓ తాజా ఉదాహరణ.
Corruption | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యాశాఖలోని అన్ని కార్యాలయాలకు అవినీతి చీడ పట్టుకున్నది. ఏదైనా పనికోసం వచ్చే వారిని డీఈవో కార్యాలయం మొదలు వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పీల్చిపిప్పి చేస్తున్నారు. ఫైల్కో రేటు.. పనికో పర్సంటేజీ చొప్పున అందినకాడికి దండుకుంటున్నారు. ఇక్కడ ఫైళ్లు కదలాలంటే చేతులు తడపాల్సిందే. అధికారులు, సిబ్బంది వేధింపుల భరించలేక ఏసీబీని ఆశ్రయించే వరకు పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్కూళ్ల అనుమతులు కావాలన్నా.. పర్మిషన్ టు ఓపెన్ (పీటీవో) ఎక్స్టెన్షన్ టు రికగ్నైజేషన్ (ఈటీఆర్)ల జారీ దందా పెద్ద మొత్తంలో సాగుతున్నది. ఆఖరికి పదో తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు వచ్చే వారిపేర్లతోనూ వసూళ్ల దందా సాగుతున్నది. టీసీ పుస్తకాలు మొదలుకుని హాల్టికెట్లు ఇచ్చేందుకు, నామినల్ రోల్స్ సమర్పణకు ప్రైవేట్ స్కూళ్లు ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందే.
డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో (డీఎస్ఈ) పనిచేసే ఓ ఉద్యోగి లంచాలు పుచ్చుకోవడంలో చాలా ప్రత్యేకతను చాటుకుంటారన్న ప్రచారం ఉన్నది. ఈయన ఏజెంట్లు, కిందిస్థాయి ఉద్యోగులపై అస్సలు ఆధారపడరు. చేతికి మట్టి అంటకుండానే పుచ్చకుంటారు. సాయంత్రం ఇంటికెళ్లే సమయం వరకు వేచి చూసి.. లంచం ఇచ్చే వ్యక్తిని ఆయా మొత్తాన్ని ఆరుబయట చెట్లపొదల్లో, చెత్తలో వేసి వెళ్లమని చెప్తుంటాడు. అక్కడ వేయగానే ఏసీబీ సహా ఇతరులు ఎవరూ రాలేదని నిర్ధారించుకుని తాను వెళ్లి ఆ మొత్తాన్ని జేబులో వేసుకుని వెళ్తారు.
కోర్టు ఉత్తర్వుల ద్వారా నూతన పోస్టింగులు, బదిలీలు జరిగాయంటే ఖమ్మం జిల్లాలోని డీఈవో కార్యాలయాల అధికారులకు పండుగే. ఫోకల్ పోస్టుకో రేటు.. నాన్ ఫోకల్ పోస్టుకో రేటు చొప్పున వసూలు చేస్తుంటారని గుసగుసలు. ఇటీవల 20 మంది స్పౌజ్లకు పోస్టింగ్ విషయంలో భారీ అవినీతే వెలుగుచూసింది. తొలుత ఒకచోట ఆర్డర్లు జారీచేసి, ఆ తర్వాత అమ్యామ్యాలు పుచ్చుకొని అనుకూలమైన చోట పోస్టింగులను జారీచేశారు. కారుణ్య నియామకాల విషయంలోనూ భారీగా డబ్బు చేతులు మారుతున్నది. మధిరలో అటెండర్ నుంచి రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్కు అక్కడి ఓ అధికారి ద్వారా రూ.20 వేలు పుచ్చుకున్నట్టు తెలిసింది. పాస్పోర్ట్ ఎన్వోసీల జారీ విషయంలోనూ చేతులు చాస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
నిర్మల్ జిల్లా డీఈవో కార్యాలయంలో అవకతవకలకు అంతూపంతు లేకుండాపోతున్నది. కొంతకాలం క్రితం కేజీబీవీ సీఆర్టీలు, పీజీసీఆర్టీలుగా ఎంపికైన ఉపాధ్యాయుల నుంచి డబ్బు వసూలు చేసిన ఘటన ఇక్కడ వెలుగుచూశాయి. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేసిన విషయం రచ్చకెక్కింది. తీరా ఓ ఉపాధ్యాయ సంఘం చొరవతో ఆ సొమ్మును తిరిగి ఇచ్చేశారు. సైన్స్ఫెయిర్ కోసమని ప్రైవేట్ స్కూళ్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీల్లో కొందరు టీచర్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి లబ్ధిపొందేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవడంలోనూ విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.
పాఠశాలలకు అనుమతులంటే విద్యాశాఖకు పండుగనే చెప్పాలి. ముడితేనే ముందుకు అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం నడుస్తున్నది. పర్మిషన్ టూ ఓపెన్ (పీటీవో), ఎక్స్టెన్షన్ టూ రికగ్నైజేషన్ (ఈటీఆర్)ల జారీ పెద్ద దందాను తలపిస్తున్నది. కొంతకాలం క్రితం హైదరాబాద్ జిల్లాలో ఓ పాఠశాల యాజమాన్యం పీటీవో కోసం దరఖాస్తు సమర్పించింది. నెలలు గడిచినా పనికాలేదు. దీంతో రూటుమార్చిన యాజమాన్యం తెలిసిన ఓ ఉన్నతాధికారిని సంప్రదించింది. ఆయన చెప్పిన ఓ అధికారిని కలవడం, ఆయన ఎంతకావాలో సెలవియ్యడం, ఆ మొత్తాన్ని చేతిలో పెట్టినరోజే ఫైల్ మెరుపువేగంతో ఆమోదం పొందడం గమనార్హం.
కొందరు డీఈవోల పరిస్థితి చిక్కరు దొరకరు.. అన్నట్టుగా ఉన్నది. వరంగల్, కరీంనగర్, హనుమకొండ జిల్లాల విద్యాశాఖ అధికారులు మందీమార్బలాన్ని వేసుకుని పాఠశాలల పర్యవేక్షణ పేరుతో హల్చల్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు కార్యాలయంలో అస్సలు కనిపించరని సాక్షాత్తు టీచర్లే వాపోతున్నారు. కొంతమంది ఫోన్లు కూడా ఎత్తడం లేదంటున్నారు. ఈ మూడు జిల్లాల్లోని ఓ డీఈవో ఉదయం పదకొండు గంటలకు అటూ ఇటుగా వచ్చి ఓ గంట ఉండి గయాబ్ అవుతున్నారని సాక్షాత్తు కార్యాలయ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ఓ జిల్లా డీఈవో ఫోన్లే ఎత్తరని.. అందుబాటులో ఉండరని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో డిప్యూటేషన్లకు రెండు, మూడు లక్షలు వసూలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యాలయంపై రెండుసార్లు ఏసీబీ దాడులు జరిగి, రెడ్హ్యాండెండ్గా కార్యాలయ సిబ్బంది దొరికారు. అయినా అవినీతి చాయలు కనిపిస్తూనే ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.