తార్నాక దవాఖానలో సకల సదుపాయాలు కల్పిస్తాం: సజ్జనార్
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన తార్నాకలోని ఆర్టీసీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీచేసి అక్కడి వైద్యసేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. రోగుల సంక్షేమం కోసం మరో రెండు అంబులెన్స్లను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను రిఫరెల్ దవాఖానలకు, బయటి వైద్య పరీక్ష కేంద్రాలకు పంపకుండా కార్పొరేట్ దవాఖాన తరహాలో అన్ని సదుపాయాలను ఇక్కడే కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సజ్జనార్ పరిశీలించారు. ఆర్టీసీలోని 48 వేల మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 28 వేలమందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు వివరించారు. అనంతరం సజ్జనార్ ఆ దవాఖాన ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ (రెవెన్యూ, ఐటీ), కార్యదర్శి పురుషోత్తం, ఈడీలు యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, మునిశేఖర్, దవాఖాన సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.