50 ఏండ్ల ముందుచూపుతో సూపర్స్పెషాలిటీ దవాఖానలు
వైద్యరంగంలో దేశంలోనే మొదటి స్థానానికి తెలంగాణ
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుపుతాం: మంత్రి హరీశ్రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): పేదలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒకేరోజు మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. అల్వాల్లో దవాఖానకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ప్రభుత్వపరంగా ఉత్తమ వైద్య సేవలను అందించే అంశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. 50 ఏండ్ల ముందుచూపుతో ఈ దవాఖానలను నెలకొల్పుతున్నారని అన్నారు. ఈ మూడు దవాఖానలతోపాటు గచ్చిబౌలిలోని టిమ్స్, వరంగల్ హెల్త్సిటీ ఏర్పాటుతో రాష్ట్రంలో 7500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడకముందు 30 వేల మంది కిడ్నీ రోగులకు మూడు డయాలిసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని, గత ఏడేండ్లలో 102 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐసీయూ కేంద్రాలను ఐదు నుంచి 80కి పెంచామని తెలిపారు. నేడు ప్రతి తాలూకా కేంద్రంలో ఐసీయూ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వీ-డయాగ్నోస్టిక్స్తో రూపాయి ఖర్చు లేకుండా వైద్యపరీక్షలు చేస్తున్నామని తెలిపారు. గుండె శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక క్యాత్ల్యాబ్లు పనిచేస్తున్నాయన్నారు. త్వరలో దవాఖానాల్లో మూడు పూటల భోజన వసతులను కల్పిస్తామని చెప్పారు. వైద్య సేవలందించడంలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ అని చెప్పుకునే వారు చివరి స్థానంలో
డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకొనే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం, ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న రాష్ట్రం పేదలకు వైద్యం అందించడంలో చిట్టచివరి స్థానంలో ఉన్నదని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. 2014 నాటికి తెలంగాణలో కేవలం మూడు మెడికల్ కాలేజీలుండేవని, ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని కాపీ కొట్టి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ పెడతామంటున్నారని మంత్రి చెప్పారు. నర్సింగ్ కాలేజీలను కూడా జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఇంత జరుగుతున్నా కొంతమంది నాయకులు సోయి లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
కేసీఆర్కు పేదల ఆకలి తెలుసు: తలసాని
సీఎం కేసీఆర్కు పేదల ఆకలి తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని పనులను కేసీఆర్ చేస్తూ ప్రజల మనస్సులో ఉండిపోయారని చెప్పారు. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు అందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందని చెప్పారు. కరోనా కాలంలో కూడా సీఎం స్వయంగా ప్రతి అంశాన్ని పరిశీలించి వైద్య సేవలను సక్రమంగా అందేలా చూశారని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనతో పుట్టిన ఈ సూపర్స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటు గొప్ప నిర్ణయమని సంతోషం వ్యక్తం చేశారు.