మహబూబాబాద్ : రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) పేర్కొన్నారు. వైద్య రంగంలో సీఎం కేసీఆర్(CM KCR) విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని తెలిపారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా జనరల్ ఆస్పత్రిలో రేడియోలజీ ల్యాబ్(Radiology Lab)ను, రోగుల బంధువుల కోసం నిర్మించిన విశ్రాంతి షెడ్డును మంత్రి ప్రారంభించారు. గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ (KCR Nutrition Kit)ను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులో రికార్డు స్థాయిలో సాధారణ ప్రసవాలు(Normal deliveries) పెరిగాయని స్పష్టం చేశారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలన్నీ పురుడు పోసుకున్న తల్లుల నవ్వులతో, పసిపిల్లల కేరింతలతో కళకళలాడుతున్నాయని అభివర్ణించారు. ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్తో బాల, బాలికల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశంలో మాతా,శిశు మరణాలు రాష్ట్రంలో తగ్గాయని వివరించారు.
షోపకాహార లోపాన్ని నివారించి, శిశువులు, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యం కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వం రూ. 12,325 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు,ఎంపీ మాలోత్ కవిత, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.