Pocharam Srinivas Reddy | ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్స్లో వైద్యారోగ్య దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరగా.. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, డీఆర్వో రాజారెడ్డి, బాన్సువాడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం సాధించిన ప్రగతి, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఏటా ప్రైవేటు ఆసుప్రతుల సంఖ్య పెరుగుతుందని, ఆసుపత్రులు పెరిగాయంటే పేషెంట్లు పెరుగుతున్నారని అర్థమన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదైన వ్యవహారమన్నారు. పేదలు ఆర్థికంగా భరించలేమని, రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులను విస్తరించి.. అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ.11వేలకోట్లు కేటాయించారన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే 2వేల పడకల కెపాసిటీ ఉండగా.. మరో 2వేల పడకలను పెంచేందుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారన్నారు. పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాల్లో ఏర్పాటు చేశామని, ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు దేశంలో మరే రాష్ట్రంలో లేదన్నారు. వరంగల్లో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదన్నారు. గతంలో రాష్ట్రంలో 3డయాలసిస్ కేంద్రాలు ఉంటే నేడు 26 పెరిగాయన్నారు.
బాన్సువాడలో రూ.20కోట్లతో వంద పడకల మాతాశిశు ఆసుప్రతిని నిర్మించామని, రెండేళ్లలోనే ఆసుపత్రికి జాతీయ అవార్డు వచ్చిందన్నారు. వైద్యులు, సిబ్బంది కృషే అవార్డుకు కారమన్నారు. బాన్సువాడ ఆసుపత్రికి జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటుగా మహారాష్ట్ర నుంచి సైతం జనం ఆసుపత్రికి వస్తున్నారన్నారు. బాన్సువాడ పట్టణంలో రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. వర్నిలో రూ. 10.70కోట్లతో నిర్మించే 30 పడకల ఆసుపత్రికి, కోటగిరిలో రూ.13 కోట్లతో 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పేదలకు వైద్య సేవలు ఇంకా విస్తరించాలన్నారు.