అమీర్పేట్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. పెద్ద రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా చేపట్టిన చర్యల వల్ల రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లోనే ఉన్నదని వివరించారు. ఇది కొవిడ్ పట్ల అవగాహన పెంచుకుంటూ, భవిష్యత్తును ఆశాజనంగా తీర్చిదిద్దుకునే దిశగా అడుగులు వేయాల్సిన సమయమని చెప్పారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు సౌజన్యంతో హైదరాబాద్లోని సనత్నగర్ సెయింట్ థెరిస్సా దవాఖానలో రూ.కోటి వ్యయంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంటును మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సంస్థ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు హైదరాబాద్లోని పలు ప్రభుత్వ దవాఖానల సేవల కోసం అందజేసిన ఏడు అంబులెన్సులకు జెండా ఊపారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలానికి తొలి అంబులెన్స్ను కేటాయిస్తూ అధికారులకు తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొవిడ్పై పోరులో మహీంద్రా గ్రూప్ అందిస్తున్న సహకారం ఎనలేనిదని ప్రశంసించారు. సీఎస్సార్ కింద విలువైన సేవలు అందిస్తున్నారని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాను అభినందించారు. మహీంద్రా గ్రూపు తన సేవలను అన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. మహీంద్రా గ్రూప్ రాష్ట్రంలోని జహీరాబాద్ యూనిట్ నుంచి ఏటా లక్ష ట్రాక్టర్లు ఉత్పత్తి చేయడం, టెక్ మహీంద్రా ద్వారా 24 వేల పై చిలుకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు. అత్యున్నత ప్రమాణాలు పాటించే మహీంద్రా గ్రూప్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయం మంజూరు చేసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్రంజన్, మహీంద్రా గ్రూపు సీఈవో సీపీ గుర్నాని, సెయింట్ థెరిస్సా దవాఖాన అడ్మినిస్ట్రేటర్ థామసమ్మ, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.