రూ.592 కోట్లకు కొనుగోలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వ్యాపార విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. బ్రిటన్కు చెందిన స్టోక్ పార్క్ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 57 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.592 కోట్లు). అద్భుతమైన క్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ను స్టోక్ పార్క్ నడుపుతున్నది. 49 లగ్జరీ బెడ్రూమ్స్, సూట్స్, 27-హోల్ గోల్ఫ్ కోర్స్, 13 టెన్నిస్ కోర్టులతోపాటు 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేట్ గార్డెన్లను కలిగివున్న స్టోక్ పార్క్ గతంలో ‘గోల్డ్ఫింగర్’ (1964), ‘టుమారో నెవర్ డైస్’ (1997) లాంటి ప్రఖ్యాత జేమ్స్ బాండ్ చిత్రాల్లో దర్శనమివ్వడం గమనార్హం. ఇంధనేతర రంగాల్లో వ్యాపారాలను విస్తరిస్తున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆటబొమ్మల తయారీ సంస్థ హామ్లిస్ను కొనుగోలు చేశారు దీంతో భారత మార్కెట్లో మెరుగైన అవకాశాలున్న ఈ రంగంలోకి హామ్లిస్తో కలిసి ప్రవేశించాలని భావిస్తున్న రిలయన్స్.. మరోవైపు వినియోగ ఆధారిత రంగాలపై కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆతిథ్య రంగంలోకి, జియో బ్రాండ్తో టెలికం రంగంలోకి ప్రవేశించింది.