కరోనా పాజిటివ్ వచ్చిన మూడు నుంచి ఏడు రోజుల్లో ఒక్క ఇంజెక్షన్ ఇస్తే వైరస్ మటాషే! కాక్టెయిల్ డ్రగ్గా పిలుస్తున్న రూ.59,750 వేల విలువైన ఈ ఇంజెక్షన్ను స్వల్ప, మధ్యస్త లక్షణాలున్నవారికి ఇస్తే వారంలోనే మోనోక్లోనల్ యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతాయి. వైరస్కు ఉండే (స్పైక్ ప్రొటీన్) కొమ్ముల్లాంటి నిర్మాణాలు శరీరంలోని కణాలకు అతుక్కోకుండా అడ్డుకోవడం ఈ యాంటిబాడీస్ ప్రత్యేకత. కాక్టెయిల్ డ్రగ్ను బ్రహ్మాస్త్రమని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) అధినేత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి వర్ణించారు. దీని వినియోగం గురవారం నుంచి హైదరాబాద్లోని ఏఐజీలో ప్రారంభమైంది. అమెరికా తదితర దేశాల్లో సమర్థంగా పనిచేసిన ఈ డ్రగ్, దేశంలో పరివర్తనం చెందినట్టుగా చెప్తున్న ‘డబుల్ మ్యుటెంట్ వేరియంట్ బి.1.617వైరస్’పై ఎంతవరకు పనిచేస్తుందనే విషయంపై ఏఐజీలో పరిశోధన మొదలైంది. దాదాపు వందమందిపై ఈ ప్రయోగం జరుగుతున్నట్టు డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి వెల్లడించారు. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తమ దవాఖానలో వంద నుంచి రెండువందల మందికి సరిపడా ఈ ఇంజెక్షన్లు ఉన్నాయని చెప్పారు. పదిరకాల కరోనా వైరస్లపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనల్లో వెల్లడైందని చెప్పారు. ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకోవడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమతిచ్చింది. ప్రస్తుతానికి రెండు లక్షల వరకు డోస్లు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. ప్రముఖ ఔషధ కంపెనీ సిప్లా దీన్ని సరఫరా చేస్తున్నది.
క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ కలయికతో ఇంజెక్షన్ను తయారుచేయడంతో దీన్ని కాక్టెయిల్ డ్రగ్గా పిలుస్తున్నారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి వైరస్ను నాశనం చేస్తాయి. మొదట అమెరికాలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) దీని వాడకానికి అనుమతినిచ్చింది. మొదట అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రయోగించారు. తర్వాత అమెరికాలో స్వల్ప, మధ్యస్త కరోనా లక్షణాలున్నవారికి విస్తృతంగా ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాల్లోనూ ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ ఔషధాన్ని ఇస్తే మంచిదని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి చెప్పారు. 65 ఏండ్లపైబడిన వారికి, గుండె సంబంధవ్యాధులు, మధుమేహం నియంత్రణలో లేనివారికి, ఒబేసిటీతో బాధపడుతున్న వారికి, హైపర్ టెన్షన్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు, ఆటోఇమ్యూన్ డిసీజెస్, అవయవాల మార్పిడి, మూలకణాల మార్పిడి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నవారిపై మొదట ఈ ఔషధాన్ని ప్రయోగించడం వల్ల ప్రాణహాని తప్పించవచ్చు. గర్భిణులు, వెంటిలేటర్పై ఉన్నవారికి, ఆక్సిజన్ అవసరమై తీవ్ర లక్షణాలున్నవారికి ఈ ఔషధాన్ని వినియోగించవద్దు. ఈ ఔషధం తీసుకున్నవారు రెండు నుంచి మూడు వారాల వరకు వ్యాక్సిన్ తీసుకోవద్దు.
దేశంలోనే మొట్టమొదటిసారి యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధం తీసుకొన్న మొహబ్బత్ సింగ్ (84) కొవిడ్ నుంచి కోలుకొన్నారు. ఐదు రోజులుగా గురుగ్రామ్లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందిన ఆయన గురువారం డిశ్చార్జి అయ్యా రు. వైద్యులు ఆయనకు మంగళవారం మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్(కాసిరిమివాబ్+ఇమ్డెవిమాబ్) ఇచ్చారు. రోచే ఇండి యా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని సోమవారం మార్కెట్లోకి విడుదలచేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనకు కరోనా సోకినప్పుడు ఇదే ఔషధం తీసుకోవడంతో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్కు ప్రచారం లభించింది. ఇది డబుల్ మ్యుటెంట్పైనా పనిచేస్తున్నట్టు వైద్యులు తెలిపారు