జహీరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తెలంగాణ, కర్ణాటక పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని, సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా విశ్రాంతి గృహంలో బీదర్, కామారెడ్డి, సంగారెడ్డి ఎస్పీలు బీ.శ్రీనివాస్రెడ్డి, చెన్న బసవన్న, ఎం.రమణకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన బీదర్, కలబుర్గా, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామన్నారు.
తెలంగాణలో నిర్వహించనున్న ఎన్నికల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎలాంటి ప్రణాళికలు అనుసరించాలో అధికారులు సూచించినట్లు తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ, అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు తెలిపారు. సమన్వయంతో పని చేయాలని కోరారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్డీవోలు పాల్గొన్నారు.