నిజామాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వేముల ఫోన్లో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు.
అలుగు పారుతున్న చెరువుల వద్దకు, పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్దకు కొంత మంది ఆసక్తితో చూడడానికి వెళ్తారని, ఇట్లాంటి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వారిని నియంత్రించాలని తెలిపారు.
గ్రామ స్థాయిలో తహిసిల్దార్లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
విద్యుత్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరం ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామ స్థాయిలో 24 గంటల పాటు అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని ఇరు జిల్లాల కలెక్టర్లకు సూచించారు.