LPG Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నాయి. హోం డెలివరీ పేరిటా ఒక్కో సిలిండర్పై రూ.50 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి నిర్ణీత దూరం వరకూ ఉచితంగానే సిలిండర్లు సరఫరా చేయాలి. వినియోగదారులు చెల్లించే బిల్లులోనే ఇందుకు సంబంధించిన చార్జీలు కూడా కలిపి ఉంటాయి. కానీ, ఏజెన్సీల నిర్వాహకులు ముక్కుపిండి మరీ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందుకోసం డెలివరీ బాయ్లను ఉసిగొల్పుతున్నారు. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే గ్యాస్ సరఫరా చేయకుండా సతాయిస్తున్నారు. మొత్తానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు గ్యాస్ ఏజెన్సీలు ఎడాపెడా బాదుతుండడంతో సామాన్యులపై ‘బండ’డు భారం పడుతున్నది.
నిజామాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ తీరుతో సామాన్యులు చితికి పోతున్నారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతోనూ తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఎలాంటి రవాణా చార్జీలు లేకుండా గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ, గ్యాస్ డీలర్లు హోం డెలివరీ పేరిట ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చేస్తోన్న అక్రమ దోపిడీతో వినియోగదారులపై ఏటా కోట్లాది రూపాయలు అదనపు భారం పడుతున్నది. ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయడం ద్వారా సంబంధిత చమురు సంస్థల నుంచి గ్యాస్ ఏజెన్సీలకు కమీషన్ వస్తుంది. వినియోగదారుడు చెల్లించే మొత్తంలో సిలిండర్ సరఫరాకు సంబంధించిన రుసుము కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఇంటికే సిలిండర్ తెచ్చి ఇవ్వాల్సిన గ్యాస్ ఏజెన్సీలు మధ్యలో డెలివరీ బాయ్స్ రూపంలో ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా ఎలాంటి పట్టింపు లేకుండా పోతోంది.
వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొందరు డీలర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అదనపు వసూళ్లతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి చమురు సంస్థల నిబంధనల ప్రకారం నిర్ణీత దూరం వరకు ఫ్రీగానే డెలివరీ చేయాలి. నిర్దేశిత దూరం దాటి గ్యాస్ సరఫరా చేస్తే నిర్ణీత మొత్తంలోనే డబ్బులు తీసుకోవాలి. కానీ కిలోమీటర్ దూరం కూడా లేనిచోట కూడా ఒక్కో సిలిండర్పై రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీకి కూత వేటు దూరంలో అందివ్వాల్సిన సేవలపైనా భారం మోపుతూ ఇబ్బందులు పెడుతున్నారు.
పట్టణాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏడాది క్రితం వరకు రూ.30 వరకు ముక్కు పిండి వసూలు చేసిన ఏజెన్సీలు ఇప్పుడు రూ.50కి పెంచి దోపిడీ చేస్తున్నాయి. అదనంగా ఎందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే సిలిండర్ సరఫరా సమయంలో చుక్కలు చూపిస్తున్నారు. సదరు వినియోగదారుడి వివరాలను నోట్ చేసుకుని ఆలస్యంగా సిలిండర్లు పంపిణీ చేయడం, లేదంటే లేనిపోని సాకులు చెప్పి సతాయించడం పరిపాటిగా మారింది. గ్రామాల్లోనూ గ్యాస్ ఏజెన్సీలు విచ్చల విడిగా పెరిగాయి. వీటి మధ్య పోటీ నెలకొన్నప్పటికీ, దోపిడి విషయంలో మాత్రం అంతా సిండికేట్గా మారి డెలివరీ బాయ్స్ రూపంలో తెగబడుతున్నారు.
ఉభయ జిల్లాల్లో నిత్యం డెలివరీ అవుతోన్న సిలిండర్ సంఖ్యను అనుసరించి దోపిడీ అక్షరాల ఏటా రూ.26 కోట్లు దాటుతుండడం విస్తుగొల్పుతున్నది. నిజామాబాద్ జిల్లాలో 3.26 లక్షల మంది వినియోగదారులుండగా, వీరికి ప్రతి రోజూ 9వేల పైచిలుకు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. నెలకు సగటున 2.70 లక్షల సిలిండర్ల విక్రయం జరుగుతున్నది. అదనపు డబ్బులు చెల్లించనిదే సిలిండర్ ఇంటికే రాదు. ఈ లెక్కన రూ.50 చొప్పున గుణిస్తే అక్షరాల నెలకు రూ.1.35 కోట్లు అవుతున్నది. ఏడాదికి లెక్కిస్తే రూ.16కోట్లు అవుతున్నదంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే లెక్కన కామారెడ్డి జిల్లాలో 2.10 లక్షల మంది వినియోగదారులుండగా, ప్రతి రోజూ ఇక్కడ 6 వేల సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. నెలలో 1.65 లక్షల సిలిండర్లు అవసరమవుతున్నాయి. అనదపు చార్జీల రూపంలో నెలకు వసూలవుతోన్న దోపిడీ రూ.82.50 లక్షలకు చేరుతోంది. ఏడాదికి ఈ అక్రమ దందా రూ.9.90 కోట్లుగా ఉండడం గమనార్హం. అంటే ఉమ్మడి జిల్లాలో సిలిండర్ల సరఫరా పేరుతో 42 గ్యాస్ ఏజెన్సీల రూపంలో అక్రమంగా వసూలవుతోన్న మొత్తం రూ.26 కోట్లుగా ఉండటం గమనార్హం. కొన్ని చోట్ల ఏజెన్సీల ద్వారా ఇంటికి సిలిండర్లు సరఫరా చేస్తోన్న వ్యక్తులు నేరుగా వినియోగదారుల నుంచి బలవంతంగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఇచ్చేది లేదంటే సిలిండర్ను నిర్దాక్షిణ్యంగా వెనక్కి తీసుకెళ్తున్న వారూ ఉన్నారు.
బండ బాదుడు.. చితక్కొట్టుడు.. వంటివి క్రికెట్ పరిభాషలో చూస్తుంటాం. కానీ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ధరల బాదుడు అన్నది ప్రజలకు మోయలేని భారంగా మారింది. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు నరకప్రాయంగా మారుతోంది. జీఎస్టీ బాదుడు, చమురు ధరల పెంపు, ఎల్పీజీ గ్యాస్ మంట ఇలా మాటిమాటికీ ధరల్లో పెరుగుదల నమోదు చేస్తుండడంతో సామాన్యులు బతకలేకపోతున్నారు. చిన్న కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.
పెరిగిన పెట్రో ధరలతో ఇప్పటికే నిత్యావసర ఉత్పత్తుల రేట్లు రెట్టింపయ్యాయి. వంటగ్యాస్ బాదుడుతో సామాన్యులు సతమతవుతున్నారు. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా వంటింటి బడ్జెట్ కుదేలవుతుండగా బాదుడు మాత్రం ఆగడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలైతే రికార్డు స్థాయిలో పెరిగి పోవడం, దీనికి తోడుగా ఎల్పీజీ సిలిండర్ సైతం రూ.1200లకు చేరువ కావడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. చేస్తున్న పనితో వస్తోన్న వేతనంలో సగానికి ఎక్కువ వంటింటికే పరిమితం అవుతోంది. మిగిలిన సొమ్ము పొదుపు చేసుకుందామన్న కష్టతరంగా మారుతోందని సామాన్యులు నిట్టూరుస్తున్నారు.
వినియోగదారుల ఇంటికి సిలిండర్లను తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులదే. నిర్ణీత దూరం దాటిన సందర్భంలోనే చమురు సంస్థల నిబంధనల మేరకు డబ్బులు తీసుకోవాలి. జిల్లాలో అలాంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. వినియోగదారులెవరైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే చమురు సంస్థల టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ రూపంలో జరుగుతోన్న వసూళ్లకు ఏజెన్సీ నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– చంద్రప్రకాశ్, నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
కామారెడ్డి, మార్చి 4: కేంద్ర ప్రభుత్వం ఒక పక్క గ్యాస్ ధర పెంచి ఆర్థిక భారం మోపుతుం టే.. ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ పేరుతో ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నరు. ఒక్కో సిలిండర్కు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సిలిండర్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
– విజయ్ కుమార్
కామారెడ్డి, మార్చి 4: గ్యాస్ సిలిండర్ను డెలివరీ బాయ్ ఇంట్లోకి కూడా తీసుకొచ్చి ఇవ్వ డం లేదు. బయటనే ఉంచి వెళ్తున్నాడు. ఇం ట్లకు తెచ్చి చెకప్ చేయకుండానే డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. ఇదేమని అడిగితే ఇష్టం వచ్చినట్లు, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు.
– శ్రీహరి
కామారెడ్డి, మార్చి 4: గ్యాస్ ఏజెన్సీల వారు సామాన్యులను కూడా వదలడం లేదు. డెలివరీ చార్జీలను వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల ఆగడాలు ఆపకపోతే సామాన్యులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఇకపై సామాన్యులు కట్టెల పొయ్యే నయం అనుకునే పరిస్థితి వచ్చేట్టున్నది.
– ఉషాకాంత్