హైదరాబాద్ : దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో 7వ బ్యాచ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం స్నాతకోత్సవం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు గత 18 నెలలుగా ఎఫ్ఆర్ఓలు శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శిక్షణలో ఉత్తీర్హులైన వారికి సర్టిఫికెట్లు, వివిధ అంశాల్లో శిక్షణ కనబరిచిన అధికారులకు వెండి, బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమానికి పీపీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన శిక్షణ అధికారులు పరేడ్ నిర్వహించగా, వందనం స్వీకరించారు. ఆ తర్వాత స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. 18 నెలల శిక్షణా కార్యక్రమంలో తాము చాలా విషయాలు నేర్చుకున్నామని, వృత్తిలో రాణించడానికి, వ్యక్తిగత జీవితంలో శిక్షణ ఎంతో దోహదపడుతుందని శిక్షణ పొందిన అధికారులు పేర్కొన్నారు. అటవీ సంరక్షణలో తమ వంతు కృషి చేస్తామన్నారు. వ్యవస్థాగతంగా, వృత్తి శిక్షణలో దేశంలోనే మేటిగానున్న తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో శిక్షణ పొందడం గర్వంగా ఉందని, అకాడమీ పేరు నిలబెట్టే విధం గా పని చేస్తూ, వృత్తికి న్యాయం చేస్తామన్నారు.
శిక్షణలో తమిళనాడుకు చెందిన దీప నాలుగు బంగారు పతకాలు, రెండు సిల్వర్ పతకాలతో బ్యాచ్ టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ డోబ్రియాల్ మాట్లాడుతూ అటవీశాఖలో ఎఫ్ఆర్ఓ ఉద్యోగం కీలకమైందని, శాఖకు వెన్నెముక వంటిదన్నారు. అకాడమీ శిక్షణను పునాదిగా భావించి క్షేత్ర స్థాయిలో అడవులను కాపాడుతూ వృత్తిని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో స్వర్గం శ్రీనివాస్, అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి, పీవీ రాజారావు తదితరులు పాల్గొన్నారు.