హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి భాష పేపర్కు పరీక్ష నిర్వహించారు. అయితే సొంత స్కూల్లో సెంటర్ల కేటాయింపు వివాదాస్పదమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో సెల్ఫ్ సెంటర్లో విద్యార్థులను ఎక్కువగా కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
మాస్ కాపీయింగ్ కోసమే ఇలా చేశారని, పరోక్షంగా అధికారులు సహకరించారన్న ఆరోపణలొచ్చాయి. కూకట్పల్లిలోని న్యూ ఎరా పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఒక్క స్కూల్ నుంచే 337 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ జోన్లో కేవలం నాలుగు సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేయగా… 13 పాఠశాలలకు చెందిన 857 మంది పరీక్షలు రాస్తున్నారు. ఈ 857 మందిని నాలుగు సెంటర్లకు కేటాయించగా, న్యూ ఎరా పాఠశాల సెంటర్లో అదే స్కూల్కు చెందిన 80 మంది విద్యార్థులకు సెల్ఫ్ సెంటర్ కేటాయించారు. విషయం బయటికి పొక్కడం, మీడియాలో వార్తలు రావడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ సెంటర్లో నలుగురు సిట్టింగ్ స్కాడ్ను, రెవెన్యూ సిబ్బందిని మోహరించారు.
ఈ అంశంపై డీఈవో విజయకుమారి స్పందిస్తూ సాఫ్ట్వేర్ ఆధారంగానే సెంటర్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. పరీక్షల తొలిరోజే రెండు వేల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 5,17,197 మంది రెగ్యులర్ విద్యార్థులకు 5,15,374 మంది పరీక్షకు హాజరుకాగా 1,823 మంది గైర్హాజరయ్యారు. 786 మంది ప్రైవేట్ విద్యార్థులకు 626 మంది పరీక్షకు హాజరుకాగా, 160 మంది గైర్హాజరయ్యారు. 1,240 సెంటర్లలో ఫ్లైయింగ్ స్కాడ్, అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.