తెలంగాణ ఏర్పాటు మోదీకి ఇష్టం లేదా?
నమస్తే తెలంగాణతో ప్రొ. తిరుమలి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 : తెలంగాణ పుట్టుకే సరిగా లేదనడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవివేకానికి నిదర్శనమని ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అసందర్భంగా, అనుచిత వ్యాఖ్యలుచేసి తేనెతుట్టెను కదిలించారని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖలపై తిరుమలి.. నమస్తే తెలంగాణతో పంచుకొన్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణ ఇష్టం లేకే సాయం చేయట్లేదు
తెలంగాణ ఏర్పాటు ప్రధాని మోదీకి ఇష్టం ఉన్నట్టు లేదు. ఉన్నట్టయితే రాష్ర్టాభివృద్ధికి కృషి చేసేవారు. విభజన హామీలు నెరవేర్చేవారు. తెలంగాణపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జవాబు ఇస్తూ తెలంగాణ పుట్టుక సరిగాలేదని అసందర్భంగా మాట్లాడటం వెనుక ఆయన ద్వంద్వ నీతిని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. తమ నాయకుడు తెలంగాణపై ఇంతలా విషం చిమ్మిన తర్వాత బీజేపీ నేతలు రాష్ట్రంలో ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు? ఏమాత్రం ఆలోచించకుండా మోదీ ఇంత అనుచితంగా వ్యవహరించినట్టు అనిపిస్తున్నది.
ప్రధాని హోదాలో ఇలా మాట్లాడొద్దు
తెలంగాణ వచ్చి ఏడేండ్లు దాటింది. రెండు రాష్ర్టాల్లో పాలన సాగుతున్నది. ఎప్పుడో ఏడేండ్ల క్రితం జరిగిన ప్రక్రియపై ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఆయన స్థాయికి తగనిది. ప్రధానిగా రాష్ర్టాల అభివృద్ధి గురించి, రైతులు, సంక్షేమం గురించి చర్చించాలి. రాష్ర్టాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించాలి. హామీలు నెరవేర్చాలి. తప్పించుకొనే యత్నం చేయొద్దు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు తనకు ఇష్టంలేకపోతే.. దాన్ని ప్రస్తావించే వేదిక పార్లమెంట్ కాదు. అక్కడ రాజకీయాలు కూడదు. పార్లమెంట్లో వ్యక్తిగత కక్షలు బయట పెట్టొద్దు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేకపోవడం వల్లనే మోదీ ఇలా మాట్లాడటం ద్వారా వార్నింగ్ ఇస్తున్నారని భావించాల్సి వస్తున్నది.
సమాఖ్య స్ఫూర్తిని విడువొద్దు
దేశానికి పెద్దమనిషిగా ఉండి సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ర్టాల మధ్య సఖ్యత నెలకొల్పాల్సిన ప్రధాని చులకనగా మారొద్దు. ముఖ్యమంత్రులతో తరచూ సమావేశమవుతూ.. అంతరాలను తొలిగించడానికి.. సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలకు సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుందని గ్రహించాలి. రాష్ర్టాల వైఫల్యం కోరుకోవద్దు. కొత్త రాష్ర్టాలపట్ల ప్రేమ చూపాలి. అభివృద్ధికి సహకరించాలి. అన్ని రాష్ర్టాలు కలిస్తేనే దేశం అవుతుందని గుర్తించాలి. వ్యక్తిగత కక్షతో పార్లమెంట్లో చేసే వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పుగా పరిగణించాలి.