హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయరంగ యాంత్రీకరణకు, ఫుడ్ ప్రాసెసింగ్, విత్తనరంగం బలోపేతానికి మద్దతునివ్వాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జర్మనీని కోరారు. సచివాలయంలో శుక్రవారం ఆయన చెన్నైలోని జర్మన్ కాన్సులేట్ జనరల్ మైఖేలా కుచ్లర్, హైదరాబాద్, చెన్నై జర్మన్ కాన్సులేట్ అమిత దేశాయ్, టర్కీ కాన్సులేట్ జనరల్ ఓర్హాన్ యాల్మాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్మనీ యాంత్రీకరణకు ప్రసిద్ధి చెందిందని, అందువల్ల వ్యవసాయ యాంత్రీకరణలో తెలంగాణకు మద్దతివ్వాలని కోరారు. కార్మికుల కొరత, పెరిగిన కూలీల ఖర్చు కారణంగా నేటి వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా ముఖ్యమైనదని అన్నారు. వరి, మక్కజొన్న వంటి ఉత్పత్తులను తెలంగాణ ప్రసిద్ధి చెందిందని.. ఇక్కడ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేయడానికి సహకారం, మద్దతు ఇవ్వాలని కోరారు.