R and B | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు చెందిన పనులను చేపట్టేందుకు గతంలో కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీపడేవారు. తక్కువ ధరకు టెండర్ కోట్చేసి పనులను దక్కించుకునేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్అండ్బీ శాఖ పనులను చేపట్టేందుకు ఏజెన్సీలు ముఖం చాటేస్తున్నాయి. అనేకసార్లు రీటెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. నాలుగైదు నెలల నుంచి ప్రభుత్వం ఎన్నో బిల్లులను పెండింగ్లో పెట్టడమే ఇందుకు కారణమని అధికార వర్గాలు చెప్తున్నాయి.
ప్రధాన రహదారులతోపాటు వివిధ జిల్లాలు, మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్లను నిర్వహించడం ఆర్అండ్బీ శాఖ బాధ్యత. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల మరమ్మతులు పూర్తిగా నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టే కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది చిన్న కాంట్రాక్టర్లే. పూర్తి చేసిన పనికి బిల్లు చెల్లిస్తేనే మరో పనిని చేపట్టగలిగే వారికి బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు. ఐదు నెలలుగా రూ.800 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో పురోగతిలో ఉన్న పనులను కూడా కాంట్రాక్టర్లు నిలిపివేశారని అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలోని పాత ఆర్అండ్బీ సర్కిళ్ల పరిధిలో రోడ్ల మరమ్మతులకు సంబంధించిన 1,170 పనుల కోసం నిరుడు మార్చిలో కేసీఆర్ ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది.దాదాపు 591 పనులు పూర్తయ్యా యి. మరో 450 పురోగతిలో, మిగిలిన 129 పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇంతలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కొత్త టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. ఇప్పటివరకు రూ.1,200 కోట్ల విలువైన పనులు పూర్తవడంతో ఎన్నికల నాటికే దాదాపు రూ.400 కోట్ల చెల్లింపులు జరిగాయని, మిగిలిన రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పనులు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు.