నల్లగొండ: ఎగువన ఉన్న జూరాలలో 13 గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో శ్రీశైలంలోకి 88,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులుకాగా, 824.10 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 44.08 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. విద్యుదుత్పత్తి ద్వారా 7063 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 7544 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 746 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 530.90 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 169.9082 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రివర్స్ పంపింగ్ ద్వారా 5143 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.