హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఒక ట్రాక్టర్ గ్రామాల రూపురేఖలు సమూలంగా మార్చేసింది. చెత్తాచెదారాన్ని ఎత్తిపోసి పల్లెకు పచ్చని అందా లు అద్దింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన ఊరిదారి మార్చింది. గ్రామపంచాయతీలకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లు ఇప్పుడు పల్లెకు ప్రధాన సాధనాలయ్యాయి. ప్రతి ఇంటి నుంచీ చెత్త సేకరించటం మొదలు.. అత్యవసర సమయాల్లో అంత్యక్రియలదాకా ఊరికి ప్రధాన వనరు అయ్యింది. దాంతో రాష్ట్రంలో ఇప్పుడు పల్లెపట్టులు చెత్త చెదారంలేకుండా అద్దాల్లా మెరుస్తున్నాయి. హరితహారంతో చిగుర్లుతొడిగిన మొక్కలు ఊరినీళ్ల ట్యాంకర్ పుణ్యమా అని ఏపుగా పెరిగి చెట్లుగా మారుతున్నాయి.
ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ గ్రామ అవసరాలు తీర్చడంలో కీలకంగా మారింది. గ్రామానికో ట్రాక్టర్ ఉంటే అన్ని అవసరాలకు పనికొస్తుందని సీఎం కేసీఆర్ భావించారు. దాంతో ప్రభుత్వం 1,200 కోట్లతో 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు కొనుగోలు చేసింది. ట్రాక్టర్తోపాటు ఒక ట్రాలీ, నీళ్ల ట్యాంకర్ కూడా అం దించింది. ఒక్కో యూనిట్ కోసం దాదాపు రూ.10 లక్ష లు ఖర్చుచేసింది. ఈ ట్రాక్టర్లతోనే ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరించి ఊరికి దూరంగా ఏర్పాటుచేసిన డంప్యార్డులో వేస్తున్నారు. ట్రాక్టర్లు లేని కాలంలో మూడు చక్రాల సైకిళ్లతో చెత్త సేకరించేవారు. అవి చిన్నగా ఉండటంతో అరకొరగానే చెత్తను సేకరించేవారు. దాంతో గ్రామస్థులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయటంతో దోమలు పెరుగటంతోపాటు ఊరంతా చెత్తా చెదారంతో నిండిపోయేది. మురుగు కాలువల్లో సిల్ట్ తీసి రోడ్లపై వేసేవారు. రెండు రోజుల్లోనే అది మళ్లీ కాలువల్లోకి చేరేది. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటికే ట్రాక్టర్ వస్తుండటంతో ఎవరూ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయటంలేదు. కాలువల్లోని సిల్ట్ను తీసిన వెంటనే ట్రాక్టర్తో దూరంగా తరలిస్తుండటంతో మురుగు సమస్యతోపాటు దుర్వాసన బాధలు కూడా తప్పాయి. ఇలా పంచాయతీలపై భారం పడకుండానే ప్రభుత్వం చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.
కరోనాతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకూ ఎవరూ ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో పంచాయతీ ట్రాక్టర్ బాధితులను ఆదుకొంటున్నది. కరోనా మృతులను శ్మశానాలకు తరలించేందుకు వీటినే వాడుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో కూడా గ్రామ ట్రాక్టర్ కీలకంగా మారింది. ప్రతి ఇంటికి మొక్కలను ఈ ట్రాక్టర్లలోనే సరఫరా చేస్తున్నారు. గ్రామ పరిధిలో నాటిన మొక్కలు ఎండిపోకుండా నీళ్ల ట్యాంకర్తో నీటిని చల్లుతున్నారు. దాంతో గ్రామాల్లో 85 శాతానికిపైగా హరితహారం మొక్కలు పెరిగి వృక్షాలుగా మారుతున్నాయి. గ్రామాల్లోని శిథిలాలు, పిచ్చిమొక్కలు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసి వ్యర్థాలను డంపింగ్యార్డుకు ఈ ట్రాక్టర్ల ద్వారానే చేరుస్తున్నారు. ట్రాక్టర్ వల్ల గ్రామాల్లో వచ్చిన మార్పులపై అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతమని కితాబిచ్చారు.
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేయడం వల్ల గ్రామంలోని అన్ని పనులు చేయగలమనే విశ్వాసం పెరిగింది. ఒ క్క ట్రాక్టర్ అనేక రకాలుగా ఉపయోగపడుతున్నది. ట్రాక్టర్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. పచ్చదనం, పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది.
-రఘనందన్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్
పంచాయతీలో ట్రాక్టర్ కొన్నంక అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడానికి బాగా పనికొస్తంది. ఊర్లో పాత ఇండ్లు కూలగొడితే శిథిలాలు తరలించడానికి, మొరం తీసుకురావడానికి ఉపయోగపడుతాంది. పనులు స్పీడ్గా అయితున్నయ్. గతంలో చిన్న ట్రై సైకిండ్లతో చెత్త తీసుకపోవడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మంచిగున్నది.
-నాగభూషణం,సర్పంచ్,కృష్ణాజివాడి కామారెడ్డి