సిద్దిపేట : భవన నిర్మాణ కార్మికులు అంటే.. దేశాభివృద్ధికి పునాది రాళ్ల వంటి వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇంజినీర్లకు సైతం తెలియని పనులు మీ అనుభవంతో.. సైనికుల తరహాలో పనిచేసే పనితనం మీదన్నారు. మీ సైనిక నేర్పరితనంతో సిద్దిపేట జిల్లా అభివృద్ధి జరిగిందని, ఈ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యులేనని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక బీమా రూ.3 లక్షలు ఉండేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు రూ.6 లక్షలు చేశామన్నారు. ఈ బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికులకు మోటర్ సైకిల్ అందించాలని నిర్ణయం తీసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. కార్మికుల కోరిక మేరకు న్యాక్- నేషనల్ అకాడమీ ఆఫ్ కన్సట్రక్షన్ సిద్దిపేటకు తీసుకు రాగలిగాం. త్వరలోనే న్యాక్ కోసం శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
అలాగే మరో మూడు నెలల్లో అత్యుత్తమ అంతర్జాతీయ ఎల్అండ్ టీ నిర్మాణ కంపెనీ ద్వారా కార్మికులకు శిక్షణ శిబిరాన్ని హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట భవన నిర్మాణ కార్మికుల వెసులు బాటు కోసం క్యాంపు కార్యాలయంలో పీఏను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని మంత్రి భరోసానిచ్చారు.