Construction Sector | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైంది. కీలకమైన బహుళ అంతస్థుల నిర్మాణ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో నిర్మాణరంగం ఒక్కసారిగా డీలా పడింది. గత మూడు నెలలుగా బడా నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లన్నీ పెండింగ్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణ గృహాలకు సంబంధించిన అనుమతులు ఇస్తున్నప్పటికీ సుమారు పది, ఆపై అంతస్థులు ఉన్న నిర్మాణాల అనుమతులేవీ ముందుకు కదలడం లేదు. ఒక్కో ఫైల్పై కనిష్ఠంగా రూ.20 కోట్ల మేర చార్జీలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని ముట్టుకోకపోవడంపై రియల్ఎస్టేట్ రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కొంతకాలం కిందట బెంగళూరు నగరంలో హల్చల్ చేసిన ‘డీకే ట్యాక్స్’ ఇక్కడ కూడా వస్తుందేమోనని రియల్ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో ఎంఎస్బీల అనుమతులకు సంబంధించి ప్రత్యేక ప్రక్రియ కొనసాగుతుంది. నిర్మాణదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు డాక్యుమెంట్లతోపాటు క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి ఫైల్స్ సిద్ధం చేస్తారు. అనంతరం వారానికి ఒకసారి ఎంఎస్బీ అనుమతులపై కమిటీ భేటీ అవుతుంది. ఇందులో డైరెక్టర్లు, టౌన్ప్లానింగ్ అధికారులు ఉంటారు. వీటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత అన్నిరకాలుగా నిబంధనల ప్రకారం ఉన్న వాటిని ఆయా కమిషనర్లకు పంపుతారు. వారు అనుమతులిస్తేనే ప్రక్రియ పూర్తవుతుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు, నాలుగుసార్లు ఎంఎస్బీలపై కమిటీ సమావేశమైంది. అందులో ఫైళ్లను పరిశీలించి, కమిషనర్లకు కూడా పంపారు. అయితే వాటికి ఇప్పటివరకు అనుమతులు రాలేదు. గత రెండు నెలల నుంచి అసలు కమిటీ భేటీ కావడం లేదు. దీంతో మూడు నెలలుగా హైదరాబాద్లో ఎంఎస్బీలకు అనుమతులు లేకుండా పోవడంతో నిర్మాణరంగం ఒక్కసారిగా కుదేలయ్యే పరిస్థితి నెలకొన్నది.
నిర్మాణ రంగానికి వేసవి కాలమే అనువైన సమయం. ఇది గడిస్తే వర్షాకాలంలో నిర్మాణ పనులు ముందుకు సాగవు. ముఖ్యంగా వానకాలంలో ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని బహుళ అంతస్థుల నిర్మాణాల్లో సెల్లార్ల పనులను చేపట్టకుండా అధికారులు కట్టడి చేస్తారు. అందుకే నిర్మాణదారులు వేసవిలోనే ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తారు. వేసవికి ముందుగానే అనుమతులు వస్తే వర్షాకాలం మొదలయ్యేలోపు కీలకమైన సివిల్ పనులను పూర్తిచేస్తారు. అయితే గత డిసెంబర్ నుంచి ఒక్క ఎంఎస్బీకి కూడా అనుమతి రాకపోవడంతో నిర్మాణసంస్థలు తలలు పట్టుకుంటున్నాయి.
సాధారణంగా నిర్మాణ అనుమతులనేవి నిబంధనల ప్రకారం ఉంటే వస్తాయి. గత తొమ్మిదిన్నరేండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో అదే జరిగింది. గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో ఒక్కసారిగా బెంగళూరు నగరంలో ఎంఎస్బీ అనుమతులు నిలిచిపోవడం అక్కడ రియల్ఎస్టేట్ వ్యాపారులను కలవరపెట్టింది. అనంతరం పలు రకాలుగా అనధికారిక ట్యాక్సులు చెల్లిస్తేనే అనుమతులు వస్తున్నాయనే వార్తలు వెలువడ్డాయి. బెంగళూరులో ‘డీకే ట్యాక్స్’ కొనసాగుతున్నదనే ఆరోపణలొచ్చాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తున్నదనే విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంఎస్బీల అనుమతులు నిలిచిపోవడం బెంగళూరు తరహా ట్యాక్సులు రానున్నాయనడానికి సంకేతమని రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో చర్చించుకుంటున్నారు. గత నెల, నెలన్నర రోజులుగా ఏ ఇద్దరు బిల్డర్లు కలిసినా ఇదే విషయం చర్చకు వస్తున్నదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. చదరపు అడుగుకు ఎంత నిర్ధారిస్తారు? అనధికారికంగా ఎంత చెల్లించాల్సి వస్తుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తున్నది.