మహబూబ్నగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్: మహబూబ్నగర్ సమీపంలో దివిటిపల్లిలో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదని, నెలాఖరు నాటికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురుకుల డిగ్రీ విద్యార్థులతో కలిసి మంగళవారం ఆయన ఐటీ టవర్ పనులను పరిశీలించి అనంతరం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వలసలు ఆగిపోయాయని, ఐటీ కారిడార్తో 10 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఐటీ టవర్ సమీపంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. పెట్రోలు, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం బ్యాటరీలు అందించే దివిటిపల్లి లిథియం గిగా ఫ్యాక్టరీ ప్రపంచంలోనే మూడోదని వివరించారు. కొందరు ఈ కంపెనీ ఏర్పాటుపై దుష్ప్రచారం చేస్తున్నారని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమ అయితే మొదట తామే అడ్డుకొంటామని స్పష్టం చేశారు.
మైస్ టూరిజం క్యాపిటల్గా హైదరాబాద్
హైదరాబాద్ను మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం హెచ్సీవీబీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి సింగిల్విండో విధానం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. హైదరాబాద్ పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, సౌకర్యాలపై బ్రోచర్లు, సావనీర్ తేవాలని హెచ్సీవీబీ అధికారులకు మంత్రి సూచించారు.