హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలన్న ధ్యేయంతో 130 చెక్డ్యామ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.3,825 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి మరో 1,200 చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది. అందులో తొలివిడతగా చేపట్టిన 638 చెక్డ్యామ్ల నిర్మాణ పనులు 90% మేరకు పూర్తయ్యాయి. దీంతో రెండో దశలో రెండోదశలో రూ.1,850 కోట్లతో 562 చెక్డ్యామ్ల నిర్మాణానికి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. సంబంధిత ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసి, ఆ ఫైలును ప్రభుత్వానికి పంపారు. అనుమతులు మంజూరుకాగానే రెండో విడత చెక్డ్యామ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు సాగునీటిశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన చెక్డ్యామ్ల పరిధిలో భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్డ్యామ్లు నిర్మించిన చోట నీరు నిల్వ ఉండడంతో స్థానిక మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. చెక్డ్యామ్ల నిర్మాణం ద్వారా ప్రధాన ప్రాజెక్టుల్లో పూడిక చేరకుండా నిరోధించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా చెక్డ్యామ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుండడంతో ఆయా వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరిన్ని చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను పంపుతున్నారు.