హైదరాబాద్, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతోపాటు, 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేపడుతామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టడానికి రూ.203 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
వెంటనే ఆయా భవనాల నిర్మాణాలు, మరమ్మతులకు అవసరమైన టెండర్లు పూర్తి చేసి ఈ డిసెంబర్ కల్లా ఆయా పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రి హరీశ్ రావు సూచన మేరకు నిర్ణీత సమయంలో ఆయా పనులు పూర్తి కావడం కోసమే ఈ పనులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా వైద్య వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి మంగళవారం మంత్రుల నివాసంలోని తన ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఒక్కో కొత్త భవనానికి రూ.1.5 కోట్లు, ఒక్కో సబ్ సెంటర్ నిర్మాణానికి 20 లక్షల చొప్పున కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల్లో మిగిలిన నిధులను ఈ విధంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అయితే, ఆయా పనులను అనుకున్న సమయంలో చేపట్టి, పూర్తి చేయగలిగే కాంట్రాక్టర్లకు మాత్రమే అప్పగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ నెల 9వ తేదీలోగా టెండర్లు పూర్తి చేసి, వచ్చే డిసెంబర్లోగా నిర్మాణాలు పూర్తి అయ్యేట్లు చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవ, తదితరులు పాల్గొన్నారు.